అమరావతి : ఏపీలో టూరిజానికి కేంద్రంగా కుప్పంను తయారు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 61 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా భూ సమస్య కంగుంది గ్రామస్థులను పీడించిందన్నారు. మామూలుగా అయితే ఈ భూ వివాదాన్ని పరిష్కరించడం అసాధ్యం , కానీ మనస్సు ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి సమస్యను పరిష్కరించాం అని చెప్పారు. అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాం అని తెలిపారు. అడవి పొరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రై భూమిగా కెేబినెట్లో పెట్టి మీకు భూములిచ్చేందుకు ఆమోదం తీసుకున్నాం అన్నారు సీఎం.
న్యాయం రైతుల పక్షాన ఉంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించగలిగాం అని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. 460.19 ఎకరాల భూమిని 322 మందికి పట్టాలుగా ఇవ్వడం చాలా ఆనందాన్నిస్తోందిని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఈ రూపంలో చాటుకుంటున్నాం అని ప్రకటించారు. ధర్మం రైతుల పక్షాన ఉందని, చేసే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు సీఎం. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలతో పాటు రకరకాల భూ సమస్యలు ఉన్నాయన్నారు. ఇటీవలనే శెట్టిపల్లి భూ సమస్యలను పరిష్కరించ గలిగాం అన్నారు .దీంతో ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి వచ్చిందని, రైతులకూ భూమి దక్కిందన్నారు. వట్టిచెరుకూరు గ్రామంలో వందల ఏళ్లుగా భూ సమస్య ఉండేదని, దానిని కూడా పరిష్కరించామన్నారు.















