newsseals.com
News

ఏపీకి వ‌చ్చిన 10,350 మెట్రిక్ ట‌న్నుల యూరియా

Posted by: raju August 28, 2025
newsseals-apminister

అమ‌రావ‌తి – రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి క‌బురు చెప్పారు. యూరియా సరఫరా విషయంపై కేంద్ర వ్యవసాయ ఎరువుల రసాయనిక శాఖ మంత్రితో మాట్లాడటంతో గురువారం రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా గంగవరం పోర్టునకు చేరుకుంద‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు సత్వరమే సానుకూలంగా స్పందించి రాబోయే సెప్టెంబర్ నెల 6 వ తేదీనాడు రావలసిన యూరియా సరుకును వారం ముందుగానే రాష్ట్రానికి సరఫరా చేసినందుకు కేంద్రానికి మంత్రి అచ్చెన్న‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో త్వ‌రిత‌గ‌తిన యూరియా రాష్ట్రానికి చేరుకుంద‌ని చెప్పారు.

ఇండియన్ పొటాష్ లిమిటెడ్ ( ఐ పి యల్) కంపెనీ ద్వారా ఈ ఎరువులను గంగవరం పోర్టులో దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ పంటల సాగు పరిస్థితి, వాటి దశలను బట్టి యూరియా అవ‌స‌రాల‌ను శాస్త్రీయంగా బేరీజు చేసుకుంటూ, ప్రణాళిక బద్దంగా అత్యంత అవసరం ఉన్న ప్రాంతాల‌కు, తక్షణ పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే, వ్యవసాయ అధికారుల పూర్తి పర్యవేక్షణలో రైతులకు యూరియా ను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ కమిష‌న‌ర్ డిల్లీ రావుకు మంత్రి ఆదేశించారు.

సెప్టెంబర్ నెల మొదటి వారంలో కాకినాడ పోర్ట్ కు సుమారు మరొక 25000 మెట్రిక్ టన్నుల యూరియాకు తక్కువ కాకుండా సరఫరాకు కేంద్రం హామీ ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు . రైతులు యూరియా సరఫరా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఖరీఫ్ సీజన్ కి యూరియా పుష్కలంగా లభిస్తుందని హామీ ఇచ్చారు . రైతులు వారి పంట తక్షణ అవసరాలకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, వచ్చే రబీ సీజన్ కు ముందుస్తు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు.