ఏపీ కూట‌మి పాల‌న అభివృద్దికి నమూనా : సీఎం

VijayaBhaskar · September 12, 2025
Spread the love

వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఓ విజ‌న్ ఉంద‌ని, దానిని సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం వే 2 న్యూస్ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కాంక్లేవ్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం అని ప్ర‌శంసించారు. విజన్ రూపకల్పన చేయడమే కాదు, దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్ధం చేశామ‌ని ప్ర‌క‌టించారు. 20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ప్ర‌శంస‌లు కురిపించారు. అప్పటి నుంచి భారత దేశం అభివృద్ధి అన్ స్టాపబుల్‌గా మారింద‌ని చెప్పారు సీఎం. 2038 నాటికి భారత దేశం నెంబర్-1 అవుతుందని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నానని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందిచుకుంటూ వ‌చ్చామ‌ని చెప్పారు. ఈ ఏడాదితో పాటు గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించామ‌ని అన్నారు.