ద‌మ్ముంటే జ‌గ‌న్ చ‌ర్చ‌కు రావాలి : స‌విత‌

VijayaBhaskar · September 17, 2025
Spread the love

నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాలి

అమరావతి : మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు…? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం అని జగన్ సహా వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఎద్దేవా చేస్తూ సవాల్ విసిరారు. తన ఫొటోను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ పొందిన 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఎంపిక కావడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్ ఓర్వలేక విషం కక్కుతున్నారన్నారు ఎస్ స‌విత‌. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ అబద్ధాలంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి – ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ నిర్వహణ… ఇలా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చుతున్నారన్నారు. యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు, తిరుమలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ వికృతానందం పొందుతున్నాడన్నారు. ఏ అంశంపైనైనా చ‌ర్చించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, ద‌మ్ముంటే జ‌గ‌న్ రావాల‌ని ఫైర్ అయ్యారు.