newsseals.com
DEVOTIONAL

శ్రీ కోదండ రామ స్వామికి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

VijayaBhaskar October 14, 2025
newsseals-pavitrasamarppaana
Spread the love

అంగ‌రంగ వైభవంగా ప‌విత్రోత్స‌వాలు

తిరుప‌తి : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా స్వామి వారికి పవిత్ర సమర్పణ ఘ‌నంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ద్వార పూజ‌, కుంభారాధన, హోమం, ల‌ఘు పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9 గంట‌ల నుండి యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు.

అనంతరం మూలవర్లకు, ఉత్స‌వ‌ర్ల‌కు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారికి, శ్రీ గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమ గుండాలకు, బలిపీఠానికి, ధ్వజ స్తంభానికి, విమాన గోపురానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు అత్యంత ఘ‌ణంగా నిర్వ‌హించారు . ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ముని హ‌రిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.