వైద్య రంగంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

VijayaBhaskar · October 17, 2025
Spread the love

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా వైద్య రంగానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. హైబిజ్ టీవీ ఆధ్వ‌ర్యంలో అవార్డుల కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ లాంటి కాలేజీలు తప్ప మెడికల్ కాలేజీలు లేవన్నారు. 2014లో 2,800 మెడికల్ సీట్లు ఉంటే 2023లో 10000 మెడికల్ సీట్లకు పెంచుకున్నామ‌ని చెప్పారు . పీజీ సీట్లు కూడా మూడింతలు పెరిగాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. పేదలకు సహాయం చేయగలిగినప్పుడు మనసుకి ఎంతో సంతృప్తిగా ఉంటుందన్నారు. కేసీఆర్ ఆనాడు త‌న‌కు ఏ శాఖ కావాల‌ని అడిగార‌ని, తాను కావాల‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ ఏరికోరి తీసుకున్నానని హ‌రీశ్ రావు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు 72 శాతానికి పెంచడం జ‌రిగింద‌న్నారు. డాక్టర్లు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ఎన్నో ప్రాణాలను కాపాడారని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు. బెడ్లు, ఆక్సిజన్ లేని సమయంలో కూడా మీరు సేవలు చేశారంటూ ప్ర‌శంసించారు. కరోనా సమయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే డాక్టర్లు ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. ఇదిలా ఉండ‌గా డాక్ట‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు మాజీ మంత్రి. ప్రజలకు ఎంత అవసరమో అంతే టెస్టులు, మందులు ఇచ్చి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయాల‌ని కోరారు.