ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి
అమరావతి : ఏపీని వర్షాలు ముంచెత్తనున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ. బుధవారం కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తాయని, ప్రభుత్వం అప్రమత్తం చేయాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ప్రధానంగా పలు ప్రాంతాలన్నింటికీ వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉండగా దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఎమర్జెన్సీలో ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. తక్షణమే సహాయ ఏర్పాట్లు చేయాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.