ప్ర‌జావ‌గాహ‌న‌తోనే మార్పు సాధ్యం

VijayaBhaskar · October 25, 2025
Spread the love

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

విజ‌య‌వాడ : ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న వ‌చ్చిన‌ప్పుడే ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు అన్నారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారు.. హైడ్రా ఏం చేస్తుంద‌నే విష‌య‌మై ఇప్పుడు అంద‌రిలో అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని అన్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ (ICCDR) ఆధ్వర్యంలో యునైటెడ్ నేష‌న్స్ డే ను పుర‌స్క‌రించుకుని “మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో సంస్కరణల అవసరం” అనే అంశంపై గ్రీన్ పార్కు హోట‌ల్‌లో జ‌రిగిన స‌ద‌స్సులో హైడ్రా క‌మిష‌న‌ర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. సాంస్కృతిక వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి పెద్ద పీట వేస్తుంద‌ని అన్నారు. ఆ దిశ‌గా న‌గ‌రంలో మెరుగైన జీవ‌న విధానాలు పెంపొందించేందుకు హైడ్రా ప‌ని చేస్తోంద‌ని చెప్పారు.

ఆ క్ర‌మంలోనే ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు, చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్టామ‌ని అన్నారు. ఇటీవ‌ల హైడ్రా వార్షికోత్స‌వాలు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో నాలుగైదు త‌ర‌గ‌తు విద్యార్థులు కూడా చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్‌), బ‌ఫ‌ర్ జోన్ల గురించి వివ‌రించిన తీరే హైడ్రా ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న వ‌చ్చింద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు ఏవీ రంగ‌నాథ్. న‌గ‌రంలో చెరువుల‌ను పున‌రుద్ధ‌రిస్తున్నామ‌ని.. ఆక్ర‌మ‌ణ‌లతో చెరువు ఆన‌వాళ్లు కోల్పోయిన బ‌తుక‌మ్మ కుంట‌ను స‌ర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు చెప్పారు. త్వ‌ర‌లోనే మ‌రో 5 చెరువులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయ‌న్నారు.