కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న‌లో జ‌నం దగా

VijayaBhaskar · October 26, 2025
Spread the love


నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోసం కాంగ్రెస్ పార్టీ నైజం అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని చెప్పార‌ని, యువతులకు స్కూటీలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం అన్నారని వాటిని అమ‌లు చేశారా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షనే ఇప్పుడు కూడా ఇస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లలో రేవంత్‌ ఒక్క ఇటుక పెట్ట లేద‌న్నారు., ఒక కొత్త పునాది లేదు. తెల్లారు లేస్తే మైకు పట్టుకొని కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారు. ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నారు.. మగవాళ్లకు డబుల్‌ రేటు పెట్టారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ వాళ్లు ఇంటికి వస్తే బాకీ కార్డు చూపించి ప్రజలు హామీ గురించి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

ఒక్కొక్క మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇప్పటి వరకు రూ.60 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.48 వేలు, రైతులకు రేవంత్‌ రెడ్డి బాకీ ఉన్నారని ఫైర్ అయ్యారు. బీసీలకు రిజర్వేషన్లు, దళితులకు కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఏ వర్గాన్ని వారు వదల్లేదని మండిప‌డ్డారు కేటీఆర్. రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ పెడతానని ముస్లింలను మోసం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే చిన్న షాక్‌ ఇవ్వాల్సిందేన‌ని, లేక పోతే వాళ్లు దారికి రార‌ని అన్నారు. ఇలాగే మోసం చేస్తూనే ఉంటార‌ని ఆరోపించారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే మేం ఏం చేయక పోయినా మోసం చేసినా మాకే ఓటేస్తున్నారని వాళ్లు భావిస్తారని హెచ్చ‌రించారు కేటీఆర్.