newsseals.com
News

గిరిజన సంక్షేమం అంతా బూటకం

Posted by: VijayaBhaskar October 26, 2025
newsseals-yssharmilareddy

ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌
విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై.
కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకం అని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 840 సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు సమస్యలకు లోగిళ్ళుగా మారాయ‌ని మండిప‌డ్డారు. తాగేందుకు గుక్కెడు నీళ్ళు కరువు. RO ప్లాంట్లు పనిచేసిన దాఖలాలు లేవన్నారు. పారిశుద్ధ్యం మీద పట్టింపు లేకుండా పోయింద‌న్నారు. అసలు బిడ్డలు ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో చూసే వ్యవస్థే శూన్యంగా మారి పోయింద‌ని ఆరోపించారు. ఎస్సీ హాస్టళ్లలో 228 మంది ఆడబిడ్డలకు ఒకటే బాత్ రూమ్ ఉందని కోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోవ‌డం దారుణ‌మ‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. గిరిజన విద్యార్థుల వరుస మరణాలపై కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటిదాకా 21 మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నందుకు ఆ కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 కాదు స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామ‌న్నారు. ఆ దిశగా ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలు పెట్టక పోవడం శోచనీయం అన్నారు. మరోసారి చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. వెంటనే స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 మిషన్ కు శ్రీకారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు. సంక్షేమ బడుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల‌ని కోరారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మీ నిర్లక్ష్యంతో బిడ్డలను చంపి ఆ పాపాన్ని మూట కట్టుకోకండ‌ని హిత‌వు ప‌లికారు.