newsseals.com
DEVOTIONAL

అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

VijayaBhaskar October 28, 2025
newsseals-ttdsrivarimetlapooja
Spread the love

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న

తిరుప‌తి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 31వ‌ తేదీ తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 30 నుండి న‌వంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌ ఆస్థాన మండపంలో ఘ‌నంగా నిర్వహించనున్నారు.

అక్టోబ‌రు 31వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

ఇందులో భాగంగా అక్టోబ‌రు 30వ‌ తేదీ తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో మ‌ధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్త‌న‌, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు తెలియ‌జేస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్టోబ‌రు 31న మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ధార్మిక సందేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.

న‌వంబ‌రు 1న ఉద‌యం 8.30 గంట‌ల‌కు సామూహిక నామ సంకీర్త‌న‌, ఉద‌యం 9.30 గంట‌ల నుండి స్వామిజీలు ధార్మిక సందేశం ఇవ్వ‌నున్నారు.