newsseals.com
DEVOTIONAL

సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

VijayaBhaskar November 1, 2025
newsseals-SrivariPushppaYagam
Spread the love

పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ

తిరుమల : పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, భరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.

పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. శ్రీవారి పుష్ప యాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులును శాలువతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.