newsseals.com
News

కష్ట‌ప‌డ్డాం కానీ ఓడి పోయాం : కేటీఆర్

VijayaBhaskar November 14, 2025
newsseals-KTR
Spread the love

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై

హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో త‌మ సీటును కోల్పోవ‌డం ప‌ట్ల బాధ ప‌డ‌టం లేద‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌ష్ట ప‌డ్డామ‌ని కానీ ఓడి పోయామ‌ని వాపోయారు. అధికార పార్టీ భారీ ఎత్తున ప్ర‌లోభాల‌కు గురి చేసింద‌ని, బెదిరింపుల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. త‌మ పార్టీ అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోయినా, చాలా కష్టపడి ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేశార‌ని ప్ర‌శంసించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నామ‌ని అన్నారు. ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైంద‌న్నారు.

గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించామ‌ని చెప్పారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడింద‌ని చెప్పారు. ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారని , ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయన్నారు. కానీ ఫ‌లితం భిన్నంగా వ‌చ్చింద‌న్నారు. పోల్ మేనేజ్మెంట్ చేయ‌డంలో కాంగ్రెస్ స‌క్సెస్ అయ్యింద‌న్నారు. ఈ ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చిందన్నారు కేటీఆర్. ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైన ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి అని ప్రజలు తీర్పునిచ్చారని స్ప‌ష్టం చేశారు. ఈ అంశాన్ని సానుకూల అంశంగా పార్టీ పరిగణిస్తున్న‌ద‌ని తెలిపారు.