newsseals.com
News

ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం

Posted by: VijayaBhaskar November 15, 2025
newsseals-GottipatiRavikumar

AM Green Group‌తో రూ.10,000 కోట్ల ఎంఓయూ

విశాఖ‌ప‌ట్నం : ఉత్త‌రాంధ్ర‌లో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం ఇచ్చేలా ప‌లు సంస్థ‌లు పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. విశాఖలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం AM Green Group మధ్య రూ.10,000 కోట్ల పెట్టుబడితో పలు 2G బయో రిఫైనరీలు 180 KTPA సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ స్థాపనకు ఎంఓయూలు కుదిరాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్రలో 75% శుభ్రమైన ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు మంత్రి. ప్రతి సంవత్సరం 1.5–2 మిలియన్ టన్నుల బయోమాస్ వినియోగంతో 30,000 మందికి పైగా రైతులకు లాభం చేకూరుతుంద‌ని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో దశల వారీగా ఈ ప్లాంట్లు ఏర్పాటు అవుతాయ‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. రాష్ట్రాన్ని “Farm to Flight” హబ్‌గా తీర్చిదిద్దే కీలక అడుగు ఇది అని పేర్కొన్నారు.

గత రెండు రోజులలో మొత్తంరూ. 5,22,471 కోట్ల పెట్టుబడులు, 2,67,239 ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా భారీ ఎంఓయూలు కుదిరాయని తెలిపారు మంత్రి. విండ్–సోలార్ హైబ్రిడ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, బయోఫ్యూయల్స్, పంప్డ్ హైడ్రా స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, అగ్రివోల్టాయిక్స్, పునరుత్పాదక ఇంధన తయారీ వంటి ఆధునిక రంగాల వైపు ప్రపంచ దిగ్గజ సంస్థల ఆసక్తి రాష్ట్ర సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఏపీ పునరుత్పాదక ఇంధన రంగానికి నిజమైన గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంద‌న్నారు.