సీఐఐ సదస్సు స‌క్సెస్ కావ‌డంలో సీఎం కృషి

VijayaBhaskar · November 15, 2025
Spread the love

వ్య‌వసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

విశాఖ‌ప‌ట్నం : సీఐఐ సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు యూఏఈలో, మంత్రి లోకేశ్ లండన్‌లో పెట్టుబడిదారులతో చేసిన చర్చలు రాష్ట్ర నమ్మకాన్ని పెంపొందించాయని తెలిపారు. రాష్ట్రం , కేంద్రం మధ్య నెలకొన్న సత్సంబంధాల వల్ల పెట్టుబడులకి మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం కూడా పలు నిబంధనలను సడలిస్తూ సహకరిస్తోందని చెప్పారు. ‘One Call – One Deal’ భావనతో ప్రభుత్వం పనిచేస్తుండటం వలన పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘Speed of Doing Business’ విధానాన్ని అమలు చేస్తూ కేవలం 45 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే వ్యవస్థ అమల్లోకి వచ్చిందని తెలిపారు.

రెండు రోజుల సీఐఐ సదస్సు ఫలితంగా రాష్ట్రంలో రూ. 13 లక్షల కోట్లు పైబడిన పెట్టుబడులు సమకూరగా, 112 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం రాష్ట్ర పురోగతికి శుభ సంకేతమని మంత్రి చెప్పారు. ఈ పెట్టుబడులు ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు రావడం అభివృద్ధికి నాంది పలుకుతుందని వివరించారు. సదస్సుకు రెండు నెలల ముందుగానే సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు.