ఏపీ సింగ‌పూర్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు

VijayaBhaskar · November 15, 2025
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు
విశాఖ‌ప‌ట్నం : సింగ‌పూర్ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖ సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విజ‌య‌వాడ నుండి నేరుగా సింగ‌పూర్ కు వెళ్లేందుకు విమాన స‌ర్వీసుల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో ఒప్పందం చేసుకున్నారు. విజయవాడ-సింగపూర్ మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు జరిగిన CII భాగస్వామ్య సదస్సులో సింగపూర్ హోంమంత్రి కె. షణ్ముగం, సింగపూర్ విదేశాంగ సహాయ మంత్రి గన్ సియో హువాంగ్‌తో కలిసి పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

ఇదిలా ఉండ‌గా దీనిని సాధ్యం చేయడంలో మద్దతు ఇచ్చినందుకు ప్ర‌త్యేకించి ప్రధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు సీఎం. ఈ అవగాహన ఒప్పందం కుటుంబాలు, వ్యాపారాలు, అవకాశాలను దగ్గర చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ మధ్య లోతైన విశ్వసనీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంద‌ని హామీ ఇచ్చారు సీఎం. ఈ సమ్మిట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ కోసం ఒక ముఖ్యమైన పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, స్థిరమైన విద్యుత్తును అందించడానికి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ , రాయలసీమలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఉన్నాయి.