స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

VijayaBhaskar · November 21, 2025
Spread the love

ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్బంగా జ‌మ్మికుంట‌లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వార్డు మెంబర్స్, సర్పంచులను, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలను గెలిపించు కుంటామ‌ని అన్నారు. ఏపార్టీకి లేనంత కార్య‌క‌ర్త‌ల‌, నాయ‌కుల బ‌లం త‌మ పార్టీకి ఉంద‌న్నారు. ఎమ్మెల్యేగా గెలవాలి అంటే వీరి పాత్ర కీలకం అన్నారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పారు. రెండు మున్సిపాలిటీలలో కూడా బూత్ పటిష్టం చేసుకొని గెలిపించుకుని తీరుతామ‌ని ప్ర‌క‌టించారు ఎంపీ.

107 గ్రామ పంచాయితీలలో మెజారిటీ గెలిచే సత్తా మాకే ఉందన్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలా కష్టపడ్డానో ఇప్పుడు కూడా అంతే కష్టపడి గెలిపించుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. .త్వరలోనే నాయకులు, కార్యకర్తలందరితో క‌లిసి కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్నారు. సర్పంచ్ లను గెలిపించుకొనే భాద్యత నాదేన‌ని అన్నారు. తాను ఇక్కడికి వచ్చాక గత 20 ఏళ్లలో జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఓడిపోయింది లేదన్నారు. 80 శాతం సర్పచులు మావే. ప్రతి ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించుకున్నామ‌ని చెప్పారు ఈట‌ల రాజేంద‌ర్. నేను మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకున్న వాణ్ణి కాదు. ప్రజలను, ధర్మాన్ని, పనిని నమ్ముకున్న వాణ్ణి. 25 ఏళ్లు ఇలానే బ్రతికిన అని అన్నారు.