మ‌త్స్య‌కారుల అభివృద్దికి కృషి చేస్తాం

VijayaBhaskar · November 22, 2025
Spread the love

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

ఖ‌మ్మం జిల్లా : గంగ‌పుత్రుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని, వారు త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేలా త‌మ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల అభివృద్ధి, ఆర్థిక పురోగతి, స్థానిక మత్స్యకార కుటుంబాల జీవనోపాధి బలోపేతం చేసేందుకు చేపల పెంపకంను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు.
గ్రామీణ మత్స్యకారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు, ఆదాయ వృద్ధి కల్పించే చేపల పెంపకం కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తుందని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న వ‌చ్చాక ప్ర‌జ‌లు సుఖ సంతోషాలతో ఉన్నార‌ని చెప్పారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. దాదాపు కోటి మందికి పైగా పేద‌ల‌కు దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స‌న్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. తాము అమ‌లు చేస్తున్న ఈ ప‌థ‌కం దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌నే యోచ‌న‌లో కేంద్రం ఉంద‌న్నారు. ఈ విష‌యాన్ని తాజాగా రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి ప్ర‌శంసించార‌ని చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రూ. 200 కోట్ల‌తో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల‌ను నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు. విద్య‌, వైద్యం, ఉపాధి త‌మ ప్ర‌ధాన ల‌క్ష్యాల‌న్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.