newsseals.com
News

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాలు మేమే గెలుస్తాం

Posted by: VijayaBhaskar January 14, 2026
newsseals-komatireddy

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పుర‌పాలిక సంఘం ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటుతుంద‌ని, అన్ని సీట్లు గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంకట్ రెడ్డి. బుధ‌వారం ఆయ‌న ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా
దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలోని దేవరకద్ర మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నాణ్యమైన రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, ప్రజావసరాలకు అనుగుణమైన మౌలిక వసతుల కల్పన ద్వారా దేవరకద్ర మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం అని ప్ర‌క‌టించారు.

దేవరకద్ర నియోజకవర్గం లోని భూత్పూర్ మున్సిపాలిటీలో రూ. 10.50 కోట్ల నిధులతో ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి పనులకు సహచర మంత్రి వాకిటి శ్రీహరి , స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తో క‌లిసి ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. భూత్పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులు ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగు ప‌రిచేలా చేస్తాయ‌న్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని అన్నారు. మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి మాట్లాడుతూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌న్నారు.