ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా

VijayaBhaskar · January 20, 2026
Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ క్యాబినెట్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అది క్యాబినెట్ కాద‌ని దండు పాళ్యం ముఠా అని అన్నారు. మంత్రుల మ‌ధ్య క‌మీష‌న్ల పంచాయ‌తీ కొన‌సాగుతోంద‌ని, అందుకే ఒక‌రిపై మ‌రొక‌రు తెలియ‌కుండా నాట‌కాలు ఆడుతున్నారంటూ మండిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. తెలంగాణ స‌మాజం ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించ బోద‌న్నారు. నైని స్కాం వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడుకి పరమ భక్తుడిని అని అంటాడు.. డిప్యూటీ సీఎం ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడిని అని అంటున్నాడు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకులైన వైఎస్, బాబులు ఇద్దరికి మన సీఎం, డిప్యూటీ సీఎం భక్తులుగా మారడం విడ్డూరంగా ఉంద‌న్నారు హ‌రీశ్ రావు. దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నైని బ్లాక్ టెండ‌ర్ల‌లో రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌ల మ‌ధ్య చోటు చేసుకున్న పంచాయతీ వ‌ల్ల‌నే అస‌లు బాగోతం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు హ‌రీశ్ రావు. ఈ దండుపాళ్యం ముఠా వాటాల గొడవలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలి అయ్యార‌ని ఆవేద‌న చెందారు.