newsseals.com
News

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో రైతుల‌కు ఆదాయం

VijayaBhaskar February 2, 2026
newsseals-APNaturalFarming
Spread the love

కేంద్ర బ‌డ్జెట్ లో కేటాయింపుల‌పై మంత్రి హ‌ర్షం

అమ‌రావ‌తి : కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2026-27లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. అధిక విలువ కలిగిన పంటలకు ప్రోత్సాహం ఇవ్వ‌డం వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ కలిగిన పంటలకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం వంటి పంటల సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం దీర్ఘకాలికంగా రైతులకు లాభదాయకంగా మారుతుందని తెలిపారు.

కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం ప్రకటించడం, కాయలు కాయని పాత చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి సాయం అందించడం ద్వారా తోటల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని ఈ బడ్జెట్ మరింత బలపరుస్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.