newsseals.com
DEVOTIONAL

13 నుండి న‌ర‌సింహ స్వామి గుడిలో మ‌హోత్స‌వాలు

VijayaBhaskar February 10, 2026
neewsseals-TarigondaLaxmiNarasimhaSwamy
Spread the love

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుప‌తి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు వేద మంత్రోచ్చారణల నడుమ వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 12న జ్యేష్ఠ నక్షత్రంలో సాయంత్రం అంకురార్పణతో నూతన ధ్వజ స్తంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అఖండ దీపారాధన, భగవత్ ప్రార్థన , అంకురార్పణ, ధాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

13వ తేదీన చతుస్థానార్చన, హోమం, జలాధివాసం, క్షీరాధివాసం తదితర వైదిక కార్యక్రమాలను చేపడుతారు. 14వ తేదీన చతుస్థానార్చన, ఛాయాధివాసం, పంచశయాధివాసం, లఘు పూర్ణాహుతి జరుగనుంది. 15వ తేదీన త్రయోదశి, ఉత్తరాషాడ నక్షత్రయుక్త కుంభ లగ్నపుష్కరాంశయందు ఉదయం 08.16 గం.లకు ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం చేపడుతారు. అనంతరం కుంభ ఉద్వాసనం, బింబ ఉద్వాసనం, మహా సంప్రోక్షణ, కుంభలగ్నం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహా నివేదన, బలిహారణ, మంగళ శాసన, శాత్తుమొర తీర్థ ప్రసాద గోష్ఠి విద్వత్ సంభావనం చేపడుతారు. ఈ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టిటిడి కోరుతోంది.