newsseals.com
DEVOTIONAL

శ్రీవారి సేవ చేయడం పూర్వ జ‌న్మ సుకృతం

Posted by: VijayaBhaskar April 21, 2026
newsseals-TTDEO

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం ఈవో ర‌విచంద్ర‌

తిరుపతి : తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు సమిష్టి భావనతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జాతీయ పౌర దినోత్సవం కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకే కాకుండా ప్రతి ఒక్కరికీ సంబంధించినదని తెలిపారు. అందరూ స్వయం అనుభూతితో పని చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల మధ్య ఉద్యోగులు వారధిలా ఉంటారని చెప్పారు.

చట్ట పరిపాలన సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు ఈవో. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరస్పర సహకారంతో, సమూహంగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు . అలాగే, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని, వీలైనంత వరకు తెలుగులోనే భావ వ్యక్తీకరణ చేయాలని సూచించారు. టిటిడిలో మొదటిసారి జాతీయ పౌర దినోత్సవాన్ని ఉద్యోగుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.