newsseals.com

పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం

April 27, 2026 · VijayaBhaskar

ఉండాల‌ని స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, శాస‌న స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ల‌తో క‌లిసి స‌మీక్ష చేప‌ట్టారు. సభ్యుల గౌరవం పెంచేదిగా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు ప్రైవసీ ఉండాలని చెప్పారు. గతంలో నిర్ణయించిన మేరకు పార్లమెంట్ తరహాలో సభ్యులకు సెంట్రల్ హాలును వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేయాలని స్ప‌ష్టం చేశారు.

సభ్యుల కోసం ప్రత్యేకంగా మెంబర్స్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయాలని అన్నారు సీఎం. ప్రస్తుత శాసనసభ, పాత మండలి భవనాల వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం జరక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శాసనసభ ప్రాంగణంలో భద్రతను కూడా మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు.

Related News