newsseals.com
News

పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలి : సీఎం

VijayaBhaskar May 23, 2026
newsseals-APCM
Spread the love

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌న్న చంద్రబాబు

అమ‌రావ‌తి : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగు నీటి కొరత రాకుండా చూడాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 2015లో బలమైన ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో 50.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని.. ఈ ఏడాదిలోనూ ఎల్ నినో ప్రభావంతో ఇప్పటి వరకూ 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదు అయినట్టు అధికారులు వివరించారు. గడచిన మూడు రోజులుగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు.

భూగర్భ జలాలు పెరిగితే… పచ్చదనం పెరుగుతుందన్నారు. తద్వారా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి కొంత మేర ఉపశమన లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లానే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని వెల్లడించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని స్పష్టం చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో హెచ్చరికలు, అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సమాచారం చేరవేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వచ్చే వారం రోజుల పాటు నిత్యం ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, పురపాలక, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.