newsseals.com
News

APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

VijayaBhaskar June 26, 2026
newsseals-APAIMS2.0
Spread the love

ఎరువుల పంపిణీపై ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఎరువు పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు, మళ్లింపులు, నిల్వలు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాల వంటి అవకతవకలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికే అమ‌లు చేస్తున్నామ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు.ఈ పారదర్శక విధానం అమలులోకి రావడంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని, దీంతో కొందరి స్వార్థ ప్రయోజనాలకు గండి పడిందని పేర్కొన్నారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు అనుకూలంగా ఉన్న పత్రిక ద్వారా రైతులను మభ్యపెట్టేలా నిరాధార కథనాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తనకు అనుకూలమైన కొందరు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా యూరియా, డీఏపీ వంటి సబ్సిడీ ఎరువులను అక్రమంగా మళ్లించే అవకాశం ఉండేదని, ఇప్పుడు APAIMS 2.0 వల్ల అలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడిందన్నారు.

సాక్షి పత్రిక వాస్తవాలను పూర్తిగా విస్మరించి నిరాధార కథనాలను ప్రచురించడం బాధ్యతాయుత జర్నలిజానికి విరుద్ధం. క్షేత్రస్థాయి వాస్తవాలు, అధికారిక గణాంకాలు, సంబంధిత వివరాలను ధృవీకరించిన తర్వాతే వార్తలు ప్రచురించాలని అన్నారు అచ్చెన్నాయుడు. పత్రిక యజమాని జగన్ రెడ్డి చెప్పగానే అసత్య కథనాలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే తప్ప ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడవు. నిజాలను తెలుసుకుని, వాస్తవాలను ప్రతిబింబించేలా బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాలను రైతులు విశ్వసించరని, పారదర్శక పాలనతో నిజమైన రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.