newsseals.com
News

రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

VijayaBhaskar June 29, 2026
newsseals-Atchannaidu
Spread the love

స్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని ఒకే పంటను అధికంగా సాగు చేస్తే మరుసటి ఏడాది ధరలు పడిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిర్చి, పొగాకు వంటి పంటల విషయంలో గత అనుభవాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అధిక కెమిక‌ల్స్ ఉప‌యోగించ‌డం వ‌ల‌న ఇటీవ‌ల చైనాకు వెళ్లిన గుంటూరు మిర్చి కంటైన‌ర్స్ తిరిగి వెన‌క్కి వ‌చ్చిన సంద‌ర్భాలు గ‌ర్తు చేసుకోవాల‌ని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ కూడా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలను అమలు చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పంటల నిర్వహణ సూచనలు గ్రామ స్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఎలాంటి వాతావరణ సవాళ్లు ఎదురైనా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.