ఐపీఎల్ ఫైనల్స్ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్

గెలిచిన, రన్నర్ రప్గా నిలిచిన జట్లకు లోకేష్ ట్రోఫీ ప్రదానం
అమరావతి : ఏపీలోని మంగళగిరిలో నిర్వహించిన ఏపీఎల్ ఐపీఎల్ ను తలపించేలా చేసింది. కూటమి సర్కార్ వచ్చాక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన ఫైనల్స్ ఐపీఎల్ ఫైనల్స్ను తలపించేలా అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA), జీఎంఆర్ (GMR) సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఫైనల్కు వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలి వచ్చారు. ప్రేక్షకుల కేరింతలు, యువత ఉత్సాహం, ఆకట్టుకునే డ్రోన్ షో, విద్యుద్దీపాల వెలుగులతో స్టేడియం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ, మానవవనరులు, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆయన రాకతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది.
టాస్ నిర్వహించి సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ జట్ల మధ్య తుది పోరును మంత్రి లోకేష్ ప్రారంభించగా, టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లకు అభినందనలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని యువనేత ఆకాంక్షించారు. ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగి అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రతి బౌండరీకి కేరింతలు, ప్రతి వికెట్కు హర్షధ్వానాలు, ప్రేక్షకుల స్పందనతో స్టేడియం మొత్తం మారుమోగి పోయింది. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రోన్ షో అభిమానులను విశేషంగా ఆకట్టుకుని APL ఫైనల్స్కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.