గజ వాహనంపై భక్తులను కరుణించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అడుగడుగునా కర్పూరహారతులతో స్వామివారికి ఘన స్వాగతం
తిరుపతి : తిరుపతి పరిధిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ). ఉత్సవాలలో భాగంగా రాత్రి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు గజ వాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయహస్తంతో అనుగ్రహించారు.
వాహన సేవ మార్గమంతా భక్తులు గోవింద నామ స్మరణతో మారు మ్రోగింది. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు పుణ్యా హవాచనం, వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 8.00 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. .
ఈ వాహన సేవలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.