newsseals.com
News

గిరిజ‌న ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు

VijayaBhaskar July 6, 2026
newsseals-CM

అమ‌రావ‌తి : గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని… గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని సీఎం నిర్దేశించారు. కేంద్రం కూడా డ్రగ్ ఫ్రీ కంట్రీగా భారత్‌ను తయారుచేసేలా కార్యాచరణ చేపట్టిందని దానికి అనుగుణంగానే లక్ష్యాలను నిర్దేశించు కోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ద్వారా ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నామో అన్న అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించాలని సీఎం అధికారులకు సూచించారు.

క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్ధాల సేకరణకు స్వచ్ఛ రధాలు, ఇంటింటికీ చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దుష్టమైన ఎస్ఓపీ జారీ చేయాలని సీఎం అన్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పేరుకున్న 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలని దీనిపై ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. జీరో వేస్ట్ మున్సిపల్ ప్రాంతాలు మన లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఆర్ధిక, ఆర్ధికేతర కేటగిరీలుగా విభజించి పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో కలెక్టర్లు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.