newsseals.com
News

జూలై చివరి నాటికి బోగాపురం విమానాశ్ర‌యం సిద్దం

VijayaBhaskar July 8, 2026
newsseals-BhogapuramAirPort

విశాఖపట్నం జిల్లా : అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరైనందున, అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానాశ్రయాన్ని పరిశీలించిన మంత్రి, ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించిందని తెలిపారు. ఈ నెల చివరిలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , GMR సంస్థల ఉమ్మడి కృషితో నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడుకున్నదని మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వాస్తవానికి 2026 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్, నిర్ణీత సమయం కంటే దాదాపు ఆరు నెలల ముందే కార్యకలాపాలకు సిద్ధమైందని చెప్పార

ఏరోడ్రోమ్ లైసెన్స్ జారీ చేయడానికి ముందు గత నెల రోజులుగా విస్తృతమైన తనిఖీ ప్రక్రియలు నిర్వహించామని ఆయన చెప్పారు. ప్రారంభోత్సవం జరిగిన వారం రోజుల్లోనే పూర్తి స్థాయి వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి అని ప్ర‌క‌టించారు రామ్మోహ‌న్ నాయుడు. ఏటా 4 కోట్ల (40 మిలియన్ల) మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందించిన ఈ విమానాశ్రయంలో, ‘ఫ్లయింగ్ ఫిష్’ (ఎగిరే చేప) ఆకృతిని పోలి ఉండే 78,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ఉందన్నారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, విమానాశ్రయం లోపలి , బయటి భాగాలు ఉత్తరాంధ్ర సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయ‌న్నారు. అదే సమయంలో ఇది ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలకు దీటుగా సౌకర్యాలను కలిగి ఉంటుంద‌న్నారు.