సమాజ విధ్వంసకులకు జగన్ రెడ్డి అండ

అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ ఉద్దేశ పూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి సమాజ విధ్వంసంకులు చేసిన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే… గొడ్డలి పార్టీ వారికి అండగా నిలబడి మాట్లాడుతోందన్నారు.
సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్న ‘రావణ్’ అనే యూట్యూబర్పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే… దేశంలో ఏదో పెద్ద విపత్తు వచ్చినట్లు, రావణ్ ఏదో స్వాతంత్ర సమరయోధుడు అయినట్లుగా జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గు చేటు అని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పని అయి పోయిందని సంబర పడ్డారు, కానీ ప్రజలు గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వారి బుద్ధి ఇంకా మారలేదన్నారు మంత్రి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
24 నెలల పాలనలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల వలె సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. గత ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రంపై పడిన చీకటి మబ్బులు తొలగిపోయి, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. గత 24 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఏనాడూ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ప్రవర్తించ లేదన్నారు. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్లీ రాజధాని గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. జగన్ రెడ్డికి అసలు అమరావతి సీఆర్డీఏ పరిమితుల గురించి కనీస అవగాహన కూడా లేదన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిని ‘భ్రమరావతి’ అని అవహేళన చేసి, మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి నెట్టారన్నారు.