పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి

విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాలను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పేరుతో మోసం చేస్తున్నారంటూ ఆరోపించచారు. ఇవాళ షర్మిల విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పోలవరమే, కానీ మీ వెన్నుపోటు తరతరాలకు శాపంగా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో దశ పనులకు చాలా డబ్బు కావాలి.. వచ్చే మూడేళ్ళలో రెండో దశ పూర్తి చేయడం కష్టమేనన్న మీ వ్యాఖ్యలకు ఆంతర్యం ఏమిటి ? అని నిలదీశారు షర్మిలా రెడ్డి. ఆర్ అండ్ ఆర్ కింద రెండో దశలో 32 వేల కోట్లు ఇవ్వకుంటే ప్రాజెక్ట్ ప్రయోజనం శూన్యమేనా ? అని ప్రశ్నించారు.
ఇంతకాలం హంగామా అంత బూడిదలో పోసిన పన్నీరుగా మిగలాల్సిందేనా ? అంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు DPR ప్రకారం పూర్తి నీటి నిలువ సామర్థ్యం (FRL) 45.72 మీటర్ల ఎత్తులో 194.6 TMC నిల్వ చేయగలిగితేనే 35 లక్షల ఎకరాలకు సాగునీరు, 28 లక్షల మందికి త్రాగునీరు అందించడం సాధ్యమవుతుంది. మరి 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ద్వారా సమకూరే ప్రయోజనం ఏంటి ? చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పేర్కొన్నారు షర్మిలా రెడ్డి. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి నిల్వ సామర్థ్యం MDDL 41.15 మీటర్ల ఎత్తులో 119 TMC లకే తొలి దశ పూర్తి చేసి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారు ? ఎంతమంది గొంతు తడుపుతారో చెప్పాలన్నారు. 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తూ పోలవరం ప్రాజెక్టు కాస్త పోలవరం బ్యారేజ్ గా మార్చి, జాతికి అంకితం ఇస్తామని చెప్తున్న చంద్రబాబు గారు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.