newsseals.com
News

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

VijayaBhaskar July 21, 2026
newsseals-APGovt

అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండిలా సాగుతున్నాయని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటలు తాగునీరు, పార్కులు, శ్మశానాల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రస్థాయిలో 4వేల పెన్షన్, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నక్యాంటీన్లు వంటివి అమలు చేస్తున్నాం. ప్రజలంతా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో రాష్ట్ర ఆదాయం రూపాయి అయితే ఖర్చు 1.60పైసలు ఉండేది. గత రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడి పరిశ్రమలు తెచ్చి, ఆగిపోయిన పనులు ప్రారంభించాం. ఇప్పటికీ రూపాయి ఆదాయానికి ఖర్చు 1.40పైసలుగా ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టు కోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు.

ఎన్నికల సమయంలో బట్టలు పెట్టి పట్టాలిస్తానన్న ప్రధాన హామీని నేడు నెరవేర్చాన‌ని ప్ర‌క‌టించారు . ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కలసికట్టుగా పని చేస్తున్నాయి. డిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం అవసరం. ప్రధానిమంత్రి మోదీజీ అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కల నెరవేర్చారు. పోలవరం, అమరావతికి నిధులిచ్చారు. అమరావతికి చట్టబద్ధత కల్పించారు. చంద్ర‌బాబుని తప్పుడు కేసులో జైలుకు పంపినపుడు అన్నగా నిలబడతా అని పవనన్న భరోసా ఇచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాన‌ని అన్నారు నారా లోకేష్‌. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేందుకు అందరం కలసి పని చేస్తున్నాం. మీరిచ్చిన బాధ్యతను పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నాం. అభివృద్ధి, సంక్షేమంతో పాటు మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాన‌ని అన్నారు.