newsseals.com
News

మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాలి

VijayaBhaskar July 25, 2026
newsseals-PawanKalyan

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియకు కొంత మేర ఇబ్బందులు కలిగించవచ్చు అని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం జాప్యానికి తావు లేకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలని స్ప‌ష్టం చేశారు. అవసరం అయితే డ్రోన్ల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇవాళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో సీడ్ బాల్స్ పంపిణీ కార్య‌క్ర‌మంపై ఆరా తీశారు.

అటవీ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిన చోట కచ్చితంగా అడవి పునరుద్ధరణ మొదలవ్వాలని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . మానవ వనరులతో సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రాంతాల్లో మొలకలు వస్తే, వాటిని సంరక్షించడం కోసం తగిన చర్యలు తీసుకోవాని ఆదేశించారు. 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. ఈ కార్యక్రమ నిర్వహణలో ఎవరూ అలక్ష్యంగా ఉండవద్దని హెచ్చ‌రించారు. సీడ్ బాల్స్ చల్లి సరిపుచ్చకుండా, వేడి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొక్కల పరిరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాలని స్ప‌ష్టం చేశారు. విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు.