శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో తిరుపతి లోని ప్రముఖ ఆలయం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాల వివరాలు వెల్లడించింది. ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవం జరుగుతుంది. 12న చక్రతాళ్వార్, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ తిరునక్షత్రం నిర్వహిస్తారు. 16న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు. 21వ తేదీ వరలక్ష్మీ వ్రతం చేపడతారని తెలిపింది టిటీడి.
ఇక ఆగస్టు 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మ వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 26న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. 28న శ్రావణ ఉపకర్మ సందర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ కృష్ణ స్వామి వారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్ తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం శ్రీ భూ సమేత గోవింద రాజస్వామి వారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు.