వైసీపీలోకి విజయ సాయి రెడ్డి రానున్నారా..?

తాడేపల్లి గూడెం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొంత కాలం పాటు దూరంగా ఉంటూ వచ్చారు మాజీ ఎంపీ , కింగ్ పిన్ గా పేరు పొందిన విజయ సాయి రెడ్డి. తాను పార్టీతో టచ్ లో లేడు. ఈ తరుణంలో రాజకీయ వర్గాలలో మరో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ మరోసారి జగన్ రెడ్డితో దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆ మేరకు తను కూడా ఓకే చెప్పినట్లు టాక్. ఇప్పటి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడం, ఏపీలో కూటమి సర్కార్ కు ధీటుగా తయారు చేసేందుకు కావాల్సిన బలాన్ని, బలగాన్ని తయారు చేయడంలో కీలకమైన పాత్ర పోషించేందుకు కొందరు నేతలను, తనకు నమ్మకమైన వారిని ఎంపిక చేసే పనిలో జగన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి వైసీపీలోకి తిరిగి రానున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా చూస్తే ‘నంబర్ 2’ స్థానానికి తిరిగి రావడానికి మాజీ ఎంపీకి మార్గం సుగమమవుతోంది. ఇటీవలి కాలంలో జగన్ రెడ్డికి రాజకీయ వ్యవహారాలు పెద్ద భారంగా మారాయి. ఆయన తరఫున పనులను సమర్థవంతంగా చక్కబెట్టే వారు ఎవరూ లేకుండా పోయారు. కనీసం ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. సన్నిహిత వర్గంలోని చెవిరెడ్డి నుంచి సజ్జల వరకు జగన్ అందరిపైనా నమ్మకం కోల్పోయారు.
విజయసాయిరెడ్డి ఉంటే అన్నీ చక్కబడతాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇరు వర్గాల మధ్య చర్చల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్న ప్రచారం జరుగుతోంది.అయితే, విజయసాయిరెడ్డి తిరిగి తాడేపల్లి ప్యాలెస్లో అడుగు పెట్టాలంటే అనేక సర్దుబాట్లు జరగాల్సి ఉంది. దీనికి రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని అంచనా.