ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు : సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని తెలిపారు. ఇప్పటికే రూ.రూ.11.37 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. పీపీపీ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపడుతున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు సీఎం. దీనికి కేంద్రం నుంచి సహకారం లభిస్తుందన్నారు. పీపీపీ ప్రాజెక్టుల ద్వారా జరిగే నిర్మాణాలపై ఓనర్ షిప్ ప్రభుత్వాలదేనని చెప్పారు. పీపీపీ వద్దంటున్నారు.. భోగాపురం మాదేనని అంటారు . అందరూ బాగుందని అంటున్నారు కాబట్టి… మాదే క్రెడిట్ అంటారు అని వైసీపీపై ఫైర్ అయ్యారు.
అభివృద్ధి జరగకూడదు కాబట్టి పీపీపీ వద్దంటూ విమర్శలు చేస్తారు. ప్రభుత్వ సేవలు సులభతరంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు సీఎం. ప్రభుత్వ సేవల లభ్యతపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఖర్చు విపరీతంగా ఉందన్నారు. వచ్చే ఆదాయంలో 96 శాతం జీతాలు, పెన్షన్లకే పోతుందన్నారు. 2014-19 మధ్య కాలంలో ఆదాయంలో 87 శాతం మేర హెచ్ఆర్ వ్యయానికి ఖర్చు అయిందని పేర్కొన్నారు. 2024-29 మధ్య కాలంలో ఆదాయాలు పడిపోవడంతో హెచ్ఆర్ వ్యయం 110 శాతానికి చేరిందన్నారు. 110 శాతంగా ఉన్న హెచ్ఆర్ వ్యయాన్ని 95 శాతానికి తెచ్చాం.. ఇది ఆదాయాలు పెంచుకోవడం ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు సీఎం.