newsseals.com
News

గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలి

Posted by: VijayaBhaskar August 6, 2026
newsseals-TelanganaCS

హైద‌రాబాద్ : డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్–2026 గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాల‌న్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని స్ప‌ష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని , విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిని పెంచడంలో ఈ గ్లోబల్ సమ్మిట్ ఒక కీలక వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ విజయం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన , సంక్షేమం వంటి అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సమావేశంలో తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ కాంప్లెక్స్‌ను వినియోగించు కోవాలని సూచన చేశారు. అలాగే రోడ్లు, విద్యుత్ , తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను సకాలంలో సిద్ధం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను విస్తరించడం, ఉపాధి కల్పనను పెంచడం, డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం వంటి అంశాలపై అధికారులు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు మరియు ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, TGIIC ఎండీ శశాంక్, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.