విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ : విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా పడింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. ‘జీరో అవర్’ (Zero Hour) కార్యకలాపాల సమయంలో విపక్ష సభ్యుల నిరసనలు , నినాదాల కారణంగా సభకు అంతరాయం ఏర్పడటంతో, రాజ్యసభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. నిర్ణీత పత్రాలను సభలో ప్రవేశ పెట్టిన వెంటనే, చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ జీరో అవర్ కార్యకలాపాలను ప్రారంభించారు, కానీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
జీరో అవర్ అంశాలను లేవనెత్తడానికి చైర్మన్ సభ్యులను ఆహ్వానించినప్పుడు కాంగ్రెస్ , ఇతర విపక్ష పార్టీల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేయడం ప్రారంభించారు. నిరసన తెలుపుతున్న సభ్యులను తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని చైర్మన్ పదేపదే కోరారు. విపక్షాల నిరంతర నిరసనలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా వ్యతిరేకించారు. ఆ తర్వాత ఖర్గే తన అంశాన్ని లేవనెత్తడానికి చైర్మన్ అనుమతించారు. అయితే, అధికార పక్ష సభ్యులు దీనిని వ్యతిరేకించారు. దీంతో ఉదయం 11:25 గంటల సమయంలో చైర్మన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ప్రభుత్వం కావాలని తమను మాట్లాడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇది కొంత కాలంగా జరుగుతూ వస్తోందన్నారు.