newsseals.com
DEVOTIONAL

100 పుణ్య క్షేత్రాల‌ను క‌లిపేలా ర‌హ‌దారులు

Posted by: VijayaBhaskar August 24, 2026
newsseals-APRoads

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క రంగాన్ని బ‌లోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా 100 పుణ్యక్షేత్రాలను అనుసంధానించే రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది స‌ర్కార్. రూ. 120 కోట్ల వ్యయంతో 205 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రాజెక్టులను చేపట్టింది. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు , వ్యవసాయ క్షేత్రాలకు అనుసంధాన రోడ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామీణ ఆలయాలకు సరైన రోడ్డు అనుసంధానం లేదు. వడపల్లి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, అందుకు తగిన రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పురోగతి లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించారు.

క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో ఆయన ఇలాంటి అనేక ఆలయాలను గమనించారు, అలాగే కొన్ని ఆలయాల వద్ద ఉన్న అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ప్రజలు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. ఆలయాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేకపోవడం వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలనే సంకల్పంతో ఆయన పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం , సాకి వంటి పథకాల నిధులను వినియోగించుకుని పాఠశాలలు, ఆలయాలు, ఆసుపత్రులు, వ్యవసాయ క్షేత్రాలకు అనుసంధాన రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పనులు వేగవంతం చేస్తున్నారు.

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా, పుట్టపర్తికి అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు . మొత్తం రూ. 120 కోట్ల వ్యయంతో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రాజెక్టులలో, 26 ప్రాజెక్టులు పూర్తయ్యాయి . ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రోడ్ల పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి.