newsseals.com
ENTERTAINMENT

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ

Posted by: VijayaBhaskar August 27, 2026
neewsseals-TelanganaExhibitersAssociation

హైద‌రాబాద్ : టికెట్ ధరల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ రాసింది. టికెట్ ధరలు,, థియేటర్ల వర్గీకరణకు సంబంధించిన భవిష్యత్తు నిర్ణయాల విషయంలో పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములందరినీ సంప్రదించాలని కోరారు. సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి ఆగస్టు 14, 2026 నాటి జీవో (G.O.) నంబర్ 77ను రద్దు చేయాలని, నిలిపి వేయాలని లేదా సవరించాలని కోరుతూ తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. ఈ జీవోలోని అనేక నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, ఇవి థియేటర్ యజమానులపై, ముఖ్యంగా సింగిల్-స్క్రీన్ ఎగ్జిబిటర్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయని సంఘం పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా 400కు పైగా థియేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం, జీవో జారీ చేయడానికి ముందు ఎగ్జిబిటర్లను లేదా పరిశ్రమలోని కీలక సంస్థలను సంప్రదించక పోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

390కి పైగా ‘ఎయిర్-కూల్డ్’ థియేటర్లు రెండేళ్లలోపు ‘పూర్తి స్థాయి ఎయిర్ కండిషనింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన ప్రధాన ఆందోళనగా మారింది. ఈ మార్పు కోసం ఒక్కో స్క్రీన్‌కు రూ. 60-80 లక్షల వరకు ఖర్చవుతుందని, అలాగే విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతాయని సంఘం తెలిపింది. నిబంధనలను పాటించని థియేటర్లను ‘నాన్-ఏసీ’ కేటగిరీకి తగ్గించే అవకాశం ఉందని, తద్వారా వాటి మనుగడ దెబ్బతినవచ్చని హెచ్చరించింది. టికెట్ ధరల శ్లాబులు ఒకదానితో ఒకటి కలిసి పోవడం పై కూడా ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాన్-ప్రీమియం ఏసీ టికెట్ల ధరలు రూ. 50 నుండి రూ. 150 వరకు, ప్రీమియం టికెట్ల ధరలు రూ. 100 నుండి రూ. 200 వరకు ఉండటం గందరగోళానికి దారితీయవచ్చని వారు పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున నిర్వహణ రుసుములను పెంచాలని, అలాగే ఐ మాక్స్ , డాల్బీ సినిమా వంటి ప్రీమియం మల్టీప్లెక్స్ ఫార్మాట్లకు తగిన గుర్తింపు కల్పించాలని కూడా సంఘం కోరింది.