newsseals.com
News

శ్రీవారి సేవకులకు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన‌

Posted by: VijayaBhaskar August 28, 2026
newsseals-SrivariSevaks

తిరుమ‌ల‌ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, అత్యవసర పోలీసు సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల టూ టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, ఆన్‌లైన్ మోసాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు , బాలికల భద్రత తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసపూరిత విధానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.

తిరుమలలో యాత్రికులకు సేవలందించే సమయంలో భద్రతా ప్రమాణాలను పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా ఘటనలు కనిపించిన వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. భక్తుల భద్రత పరిరక్షణలో శ్రీవారి సేవకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 పోలీసు సేవలను వినియోగించు కోవాలని, సైబర్ నేరానికి గురైన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణకు అందుబాటులో ఉన్న పోలీసు సహాయ వ్యవస్థలను అవసరమైన సమయంలో వినియోగించు కోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల టూ టౌన్ సీఐ, తిరుమల ట్రాఫిక్ సీఐ, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఏవీఎస్ఓ కృష్ణయ్య, శ్రీవారి సేవకుల కోఆర్డినేటర్ తదితర అధికారులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవకులు కార్యక్రమంలో పాల్గొని అవగాహన పొందారు. తిరుమలలో భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.