23న రానున్న జన నాయగన్ మూవీ

చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు జన నాయగన్ మూవీ ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్, నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు, సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీ రోల్ పోషించారు. ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. విజయ్ కి ఇదే ఆఖరి చిత్రం అని ఇదివరకే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేశాయి. ఇక తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడిగా గుర్తింపు పొందాడు విజయ్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జన నాయగన్ ఫీవర్ కొనసాగుతోంది. ఫ్యాన్స్ కోసం లక్షలాది టీ షర్ట్స్ కూడా సిద్దమయ్యాయి.
తమ అభిమాన నటుడికి వీరభిమానులుగా ఉన్న కార్మికులకు, ఇది కేవలం ఒక సాధారణ పని మాత్రమే కాదు, తమకు ఇష్టమైన తారకు అర్పించే ఒక నివాళి అని వస్త్ర సంఘం అధ్యక్షుడు తెలిపారు. జూలై 23న
చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, సినిమా రంగంలో భారీ బాక్సాఫీస్ చిత్రాలలో ఒకదానికి భావోద్వేగభరితమైన , ఘనమైన వీడ్కోలు పలికేందుకు తిరుప్పూర్ నగరం రాష్ట్రం మొత్తాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తోంది. చెన్నైకి చెందిన నటుడు విజయ్ వీరాభిమాని జయంత్ ఇలా అన్నారు, మేము విజయ్ ఫ్యాన్ క్లబ్ కోసం తిరుప్పూర్లోని ఒక వస్త్ర తయారీ యూనిట్ నుండి 500 టీ-షర్ట్లను ఆర్డర్ చేశాము, సినిమా విడుదలకు ముందే అవి మాకు అందుతాయని ఆశిస్తున్నామని అన్నారు.
తమిళనాడులోని సుమారు 1,000 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితమయ్యే అవకాశం ఉందని తమిళనాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. సెన్సార్ ధృవీకరణ పొందే క్రమంలో ఈ చిత్రం గణనీయమైన జాప్యాలు, న్యాయపరమైన అడ్డంకులు మరియు పైరసీ సమస్యలను ఎదుర్కొంది. ‘జననాయగన్’ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ , నరైన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ , ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.