కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్దం

హైదరాబాద్ : కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన తెలంగాణ ప్రజలకు, కొమురవెల్లి మల్లన్న భక్తులకు తీపి కబురు చెప్పారు. తెలంగాణ నుండే కాకుండా దేశంలోని నలుమూలల నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల ప్రయాణ ఇబ్బందులు త్వరలో తీరనున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన కొమురవెల్లి మల్లన్న స్వామి పేరుతో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
కొమురవెల్లి మల్లన్నకు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. ఆయనను కొలిచేందుకు నిత్యం వేలాది మంది తరలి వస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను కేంద్ర రైల్వే శాఖ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. స్వామి భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కొమరవెల్లి రైల్వే స్టేషన్ జూలై 26న ప్రారంభం కానుందని ప్రకటించారు కేంద్ర మంత్రి. ఆధునిక వసతులతో రూ. 5.33 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్, అందుబాటులోకి వచ్చిన తర్వాత భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుందన్నారు.