newsseals.com
BUSINESS

ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్ : అబ్దుల్లా బిన్ తౌక్ అల్

VijayaBhaskar July 22, 2026
newsseals-UAEMinister

అమ‌రావ‌తి : కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. భారత్- యూఏఈ వాణిజ్య బంధంలో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను అంది పుచ్చుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని రొయ్యలు, అరటి లాంటి ఉద్యాన ఉత్పత్తులు వాణిజ్యంలో కీలకంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ఫుడ్ పార్క్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించటం సంతోషదాయకమని ఆయన ప్రశంసించారు. అమరావతి నుంచి న్యూయార్క్ మార్కెట్ వరకూ కు డెయిరీ, పౌల్ట్రీ, సీఫుడ్ , పప్పు దినుసులు తదితర రంగాల్లో ఎగుమతులపై దృష్టి పెడతామని అన్నారు. కృష్ణపట్నం, కాకినాడ నుంచి యూఏఈకి షిప్పింగ్ రూట్లోనూ వాణిజ్యం మరింత పెరిగేందుకు సహకరిస్తామని యూఏఈ మంత్రి తెలిపారు. ఏపీ-యూఏఈల మధ్య బంధం మరింత వేగంగా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ స్పష్టం చేశారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో యూఏఈకి ఫుడ్ క్లస్టర్ చైర్మన్ సలేహ్, యూఏఈ సహాయ కార్యదర్శి మారియా అల్ ఖాసిమ్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అనూషా అల్ మర్జూఖీ, యూఏఈ ఎంబసీ నుంచి అహ్మద్ అల్ జ్నేబీ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్ , పరిశ్రమలు, ఈడీబీ, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.