దుష్ప్రచారాన్ని వేగంగా తిప్పికొట్టాలి : సీఎం

విజయవాడ : పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే పరిమిత సిబ్బందితోనూ క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించవచ్చని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందుకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని గుర్తు చేశారు. పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా అందుబాటులో ఉండాలని, అదే సమయంలో నేరస్థుల విషయంలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. తిరుమల మెట్ల మార్గంలో అపహరణకు గురైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని అత్యంత వేగంగా టెక్నాలజీ సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్న ఘటనను ఉదాహరణగా ప్రస్తావించారు. ఇలాంటి ఘటనల్లో వెంటనే స్పందించక పోతే ప్రజల్లో అపోహలు వ్యాపిస్తాయని, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
అపహరించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని త్వరితగతిన గుర్తించడానికి కారణం టెక్నాలజీనేననే విషయాన్ని గుర్తించాలన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కొందరు రాజకీయంగా నేరాలను కూడా ఉపయోగించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. పాస్టర్ ప్రవీణ్ మరణం ఘటనలో కొన్ని పార్టీలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నాలుగైదు రోజులు పట్టిందని గుర్తుచేస్తూ, ఇలాంటి వాటి విషయాల్లో త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా ద్వారా జరిగే తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఖండించే సమర్థ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో పురోగతి సాధించినా… ఇంకా పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాల ప్రభావంతో జరిగే నేరాలను పూర్తిగా అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.