ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల ఆరోగ్యం పదిలం

తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలకు చెందిన కొందరు విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు.ఈ నేపథ్యంలో టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను స్వయంగా పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 20 మంది బాలికలు, 8 మంది బాలురు ఉండగా, వారిలో 17 మంది బాలికలు, ముగ్గురు బాలురను అంబులెన్స్ ద్వారా టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు.
విరేచనాలు, వికారం, స్వల్ప కడుపు నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న 20 మంది విద్యార్థులకు ముఖ్య వైద్యాధికారి పర్యవేక్షణలో తక్షణమే అవసరమైన వైద్య చికిత్స అందించారు. చికిత్సకు విద్యార్థులందరూ సానుకూలంగా స్పందించగా, వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ చేశారు. అనంతరం వారు తిరిగి వసతి గృహాలకు చేరుకుని భోజనం చేశారు. తుది వైద్య నివేదిక ప్రకారం అస్వస్థతకు గురైన విద్యార్థులందరూ ప్రస్తుతం సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.