అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యాధునిక వసతులతో, మౌలిక సదుపాయాలతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం రూపు దిద్దుకుంటోందని , ఇందు కోసం తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సచివాలయంలో అమరావతి రాజధాని నిర్మాణం పనుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ , వంగలపూడి అనిత, ఎస్. సవిత, ఆనం రామ నారాయణ రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి దిశా నిర్దేశం చేసే పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, పేదలకు గృహ వసతి కల్పించడం, కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు, పాదచారుల భద్రత, ఆక్వా రైతులకు రాయితీతో పాటు విద్యుత్ కొనసాగింపు వంటి ప్రజా సంక్షేమ అంశాలకు ఆమోదం లభించింది. మహిళలు , పిల్లల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ చట్టానికి చేయాల్సిన సవరణలపై కూడా చర్చలు జరిగాయి. ప్రతి నిర్ణయంలోనూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా రాజధాని అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.