newsseals.com
News

దేశ నిర్మాణంలో ప్ర‌తి పౌరుడు భాగ‌స్వామి కావాలి

Posted by: VijayaBhaskar August 9, 2026
newsseals-CM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి అయ్యేలా ‘పార్ట్‌నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ (Partners in Nation Building) కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్ప‌ష్టం చేశారు. స్వాతంత్రం పొంది 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ ఏట అడుగు పెడుతున్న తరుణంలో, 2047 నాటికి వికసిత్ భార‌త్, ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకునేలా ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో ‘పార్ట్‌నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమ ప్రణాళికను ఆయన సమీక్షించారు.

ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు దేశ నిర్మాణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయడం ద్వారా ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కె. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.